28, మే 2016, శనివారం

తాపేశ్వరం కాజా - ఆత్రేయపురం పూతరేకులు

తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకులు వీటి గురిచి తెలియని గోదావరి జిల్లా వాసులు ఉండరంటే అతిశయోక్తికాదు. ఇవి మన తూర్పుగోదావరి జిల్లాకి గొప్ప కీర్తి,  ప్రతిష్ట లని తీసుకువచ్చాయి. వాటి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాము.  

తాపేశ్వరం కాజా



తాపేశ్వరం కాజా అంటే తెలియని వారు వుండరు. ఇది ఖండాంతర ఖ్యాతి నార్జించింది. . తాపేశ్వరం కాజాను మొట్టమొదటిగా కనిపెట్టి, తయారు చేసింది పోలిశెట్టి సత్తిరాజు గారు . తూర్పుగోదావరి జిల్లాలోని కె.గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామానికి చెందిన సత్తిరాజు 80 ఏళ్లక్రితం ఉపాధి నిమిత్తం తన కుటుంబ సభ్యులతో తాపేశ్వరం వలస వచ్చి చిరుద్యోగం చేసేవారు . అనంతరం చిన్న హోటల్లో మిఠాయిలను తయారు చేసి అమ్మేవారు.

అప్పట్లో ప్రత్యేక స్వీట్లు తయారుచేయాలన్న తలంపుతో మైదాపిండితో మడతలు పెట్టి కాజాలను కొత్తగా తయారు చేసి, పంచదార పాకం పెట్టి అమ్మేవారు. ఆ కాజాకు తక్కువ కాలంలోనే ఎంతో పేరు వచ్చింది. దాంతో తాపేశ్వరం కాజా రాష్ట్రవ్యాప్తంగా పేరుపొందింది. రాష్ట్రంలో ఎక్కడైనా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ, సినీప్రముఖులు ఇంట ఏదైనా శుభకార్యాలు లేదా మరేదైన కార్యక్రమాలు నిర్వహిస్తే తాపేశ్వరం కాజా తప్పకుండా ఉంటుంది. కాజాను 50 గ్రాముల నుంచి 500 గ్రాములు బరువు ఉండే విధంగా రకరకాల సైజులలో తయారు చేస్తారు. రాష్ట్రంలో తాపేశ్వరం పేరుతో పలు పట్టణాల్లో 300 వరకు స్వీటుస్టాల్లు ఉన్నాయి. ఇదంతా సత్తిరాజు చలవేనని వారంతా చెప్పుకుంటూ ఉండడం విశేషం. సత్తిరాజు కుటుంబంలో వారంతా ఇదే వ్యాపారంలో స్థిరపడ్డారు. కాజా సృష్టికర్త సత్తిరాజు ఈ లోకాన్ని విడిచి రెండు దశాబ్ధాలు కావస్తున్నా ఆయన తయారు చేసిన వంటకం అందరి మదిలో తీపి గుర్తుగా చెరగని ముద్ర వేసింది.



ఆత్రేయపురం పూతరేకులు



పూతరేకులు పేరువినగానే వాటి పుట్టిలలయిన ఆత్రేయపురం ఎవరికైనా గుర్తురావడం ఖాయం. ఆత్రేయపురం పూతరేకులు పేరు చెపితే పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికయినా నొరూరవలసిందే . ఆత్రేయపురం ప్రాంత మహిళలు తయారు చేసే పూతరేకులకు ఓ ప్రత్యేకత ఉంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే ఇవి 300 ఏళ్లుగా ఇక్కడ కుటీర పరిశ్రమంగా విస్తరించింది. వివాహాది శుభకార్యాలకు, విందులకు, వినోదాలకు ఈ పూతరేకులు విశేషంగా వినియోగిస్తారు. ఈ పరిశ్రమపై ఇక్కడి సుమారు 800 కుటుంబాలు జీవిస్తున్నాయి.

హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, చెన్నై, విశాఖపట్నం, కలకత్తా  తదితర ప్రాంతాలతోపాటు దుబాయి, అమెరికా, సింగపూర్ వంటి ఇతర దేశాలకు తీసుకెళుతుంటారు. నోటిలో పెట్టగానే కరిగిపోయే పూతరేకుల  తయారీలో ఇక్కడి నిపుణులది అందివేసిన చేయి. ఒక్క ఆత్రేయపురంలో ఏటా రూ. కోటి రూపాయలు పైబడి పూతరేకుల వ్యాపారం జరుగుతుంది. ఈ ప్రాంత మహిళలు మగవారికి ధీటుగా ఉదయం నుంచి రాత్రి వరకు ఈ పూతరేకుల తయారీలో కష్టపడుతుంటారు. పూతరేకుల తయారీ రెండు దశలుగా ఉంటుంది. మొదటిగా రేకుల తయారీ. రెండోది తినడానికి వీలుగా పంచదార, నెయ్యి, యాలికులు, బాదం తదితర మిశ్రమాల పొడివేసి చుట్టలుగా తయారు చేయడం. ఇది చాలా నేర్పుతో జాగ్రత్తగా చేయాల్సిన ప్రక్రియ. ఒక్కో పూతరేకుచుట్ట రూ. 5 నుంచి 10 వరకు అమ్ముతారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి