![]() |
Hilsa Ilisha (పులసచేప) |
గోదావరి నదీపాయలు అద్భుతమైన మత్స్యసంపదకు జలాశయాలు.నదీపాయల్లో లభ్యమయ్యే మత్స్య సంపద అంటే ఎంతటి వారైనా మక్కువ చూపాల్సిందే.రుచికే కాదు..గోదావరి చేప తింటే ఆరోగ్యం... అందుకే ఎంతటివారైనా గోదావరి చేప రుచికి దాసోహం అంటారు...
గోదావరి చేపలు చాలా రుచికరంగా ఉంటాయి.వీటిలో ముఖ్యమైనది పులస. గోదావరి వరద వచ్చిన సమయంలోనే ఇది లభిస్తుంది. వాస్తవానికి ఇది సముద్రంలో వుండే చేప. గోదావరికి కొత్తనీరు వచ్చినప్పుడు ఎదురొచ్చి ఎర్రనీటిలోని నురగను తిని రుచికరంగా తయారవుతుంది. దీని ఖరీదు వేలల్లో ఉంటుంది. ధవళేశ్వరం దిగువ గోదావరి పాయల్లో మాత్రమే ఇది లభ్యమవుతుంది.


పులసను వేటాడడం ఆషామాషీకాదు. గేలం వేస్తేనో, వల విసిరితేనో ఇవి దొరకవు. ఏటిమధ్యకు వెళ్లి వలను మత్స్యకారులు ఏర్పాటు చేసుకుంటారు. ఈ వలలూ మూడు రకాలుంటాయి. మూడు పొరలవల, సింగిల్ వల, కత్తు వలలు. పులసలు పట్టుకునేందుకు మూడ పొరల వలను వాడతారు. ఈ వలకు రూ.20 వేలు అవుతుంది. ఈవలలు ఒక్క ఏడాదికే పనిచేస్తాయి. పులసను పట్టేందుకు ఒక నావలో ముగ్గురు చొప్పున మత్స్యకారులు వేటకు వెళతారు. ఆ ముగ్గురూ కలిపి చేపలను పట్టి పెట్టుబడులు తీరుస్తారు. ఆ తర్వాత వచ్చిన లాభాలను ముగ్గురూ పంచుకుంటారు. ఇంతా చేసి తెల్లవారుజామున వేటకు వెళితే సాయంత్రానికి ఒకటి రెండు దొరికితే గొప్పే. కొన్ని సందర్భాల్లో అసలు చిక్కనే చిక్కవు. అందుకే వీటి ధర అంత అధికం.
సముద్రానికి దగ్గరగా ఉండే యానాం, కోటిపల్లి ప్రాంతాల్లో దొరికే పులసలకు తక్కువ ధర ఉంటుంది. ఎందుకంటే అవి అప్పుడే గోదావరి నీటిలోకి ప్రవేశిస్తాయి కాబట్టి. కపిలేశ్వరపురం, ఆలమూరు ప్రాంతాల్లో దొరికే చేపలు కొంచెం ధర పలుకుతాయి. పొట్టిలంక, ధవళేశ్వరం, బొబ్బర్లంక సమీపంలో దొరికే చేప ధరలు అధికంగా ఉంటాయి. ఇక్కడ దొరికే చేపలకు రుచి అధికంగా ఉండడంతో డిమాండ్ ఉంటుంది. ఆయా సైజులను బట్టి రూ.500 నుంచి రూ.6 వేల వరకూ ధర పలుకుతాయి.
వండటంలో నేర్పు ఉన్న వారు తప్ప ఇతరులు ఈ పులస పులుసును వండలేరు. కట్టెల పొయ్యిపై కుండలోనే ఈ పులసను వండుతారు. చింత పుల్లలనే వంటకు వాడతారు. మట్టికుండలో వండిన పులస పులుసు రుచికి ఏదీ సాటిరాదు. ఉల్లిపాయలు, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పేస్ట్, పొడవుగా చీరిన పచ్చిమిరపకాయలు, చింతపండు పులుసు, బెండకాయ ముక్కలు, ఆవకాయ నూనెను ఈ వంటకంలో ఉపయోగిస్తారు. చింతపండును లేతకొబ్బరి నీళ్లలో నానబెట్టి దాని నుంచి తీసిన పులుసునే కూరలోకి ఉపయోగిస్తారు. కొందరు ఒకచుక్క ఆముదాన్ని కలుపుతారు. కొంత ఉడికిన తర్వాత మంటను ఆపేసి చింతనిప్పులతోనే పులుసును మరగనిస్తారు. దీనివల్ల చేపముక్కల్లో ఉన్న సన్నటిముళ్లన్నీ కరిగిపోతాయి. కాసేపటికి కొంత వెన్నముద్దను వేసి దించేస్తారు. మొత్తం వేడంతా పోయి చల్లారిన తర్వాతే సీవండి రేకులో ఉంచుకున్న ఆవకాయతేట పులుసులో కలుపుతారు. ఈ పులస పులుసును రాత్రి వండి ఉదయం తింటేనే రుచి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి