రెండు కోడి పుంజుల మధ్య జరిగే ఆధిపత్య పోరునే "కోడి పందెం" అంటారు. ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి పండుగ రోజులలో ఈ కోడిపందాలను నిర్వహిస్తారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ ఏర్పాట్లతో పెద్ద ఎత్తున ఈ పందాలను నిర్వహిస్తుంటారు. ఈ కోడి పందాలు అతి పురాతన కాలం నుండి జరుగుతున్నట్టు చరిత్రకారులు చెబుతారు.
ఈ పందెం కోసం ప్రత్యేకంగా పెంచిన కోడిపుంజులను "పందెం కోళ్ళు" అని పిలుస్తారు . వీటి ఆహార విషయంలో యజమానులు ఎంతో శ్రద్ధ వహించి పెంచుతారు. పందెం సమయంలో పందెం కోడి కాలికి మూడు నుండి నాలుగు అంగుళాలు చురకత్తిని కట్టి పందెంలోకి దించుతారు. కోళ్లు పుంజుల కాళ్లకు కత్తులు కట్టి.. కదన రంగంలోకి దింపితే.. రక్తం చిందిస్తూ.. వీరోచితంగా గెలుపుకోసం అవిచేసే పోరాటం అంతాఇంతా కాదు. తనను అప్యాయంగా చూసుకున్న యజమానిని గెలిపించడం కోసం ప్రత్యర్థి పుంజుతో అవి శక్తి కొద్ది పోరాడుతాయి.
ఈ కోడి పందాలలో బెట్టింగు జరిగే అవకాశం ఉన్నందున మరియు శాంతిభద్రతల సమస్య ఉంటుందని, సంప్రదాయమైన ఈ క్రీడకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదు. అయినా కూడా చాటుమాటుగా ఈ కోడి పందాలు నిర్వహిస్తారు.



ఈ కోడి పందాలు ప్రాచీన క్రీడ అయినందునే , ఈ క్రీడ గురించి తాళపత్ర గ్రంధాలు కూడా వున్నాయి. ఈ గ్రంధాలలో కోడిపుంజు లలో రకాలు, వాటి లక్షణాలు, ఏ పుంజుపై ఏ రకమైన పుంజుని పందానికి దింపాలి అనే విషయాలు వీటిలో పొందు పరచబడి వున్నాయి.
ఇక ఈ పందెం కోళ్ళకు ఇచ్చే ఆహారం, శిక్షణ కూడా ప్రత్యేకంగా వుంటాయి. వీటికి ఇచ్చే ఆహారం కోసం తక్కువలో తక్కువగా వారానికి రెండు వేల రూపాయలు ఖర్చు వుంటుంది. జీడిపప్పు, బాదం పిస్తా, ఎండు ఖర్జూరం, కిస్మిస్, కోడిగుడ్డులో తెల్లసొన, మేకపాలు, దంపుడు బియ్యం, రాగులు, గంట్లు, మినపపప్పు, శెనగపప్పు, గోధుమలు కలిపిన మిశ్రమ ఆహారం పెట్టి, పందెంపుంజుని దృఢంగా, ఏపుగా తయారు చేస్తారు. ఇక పందెం దగ్గరపడే కొలదీ వాటికి తినిపించే ఆహారంలో కూడా మార్పులు చేస్తారు.

కత్తి పందాలు, డింకీ పందాలు అని రెండు రకాలుగా ఈ కోడిపందాలు జరుగుతాయి.

డింకీ పందెం: కోడి పుంజులను మామూలుగా బరిలోకి దింపితే దాన్ని డింకీ పందెం అంటారు. ఈ పోటీ పూర్తిగా కోడి శక్తి సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. రెండు కోళ్ల శక్తిసామర్థ్యాలను బట్టి ఈ పోటీలో ఫలితం ఒక్కోసారి చాలా ఆలస్యమవుతుంది. కత్తిపందాల్లో పాల్గొనే పుంజుల కంటే డింకీ పందాల్లో పాల్గొనే పుంజులు చాలా దృఢంగా ఉంటాయి.
పందెం కోళ్లను గుర్తించడం, వాటిని పోటీలకు సిద్ధం చేయడమే వృత్తిగా జీవిస్తున్నవారు ఎందరో ఉంటారు. నిర్వాహకులయితే పందెం సొమ్ములో 10 శాతాన్ని తీత గా వసూలు చేస్తారు, ఇది నిర్వాహకుల లాభం.
పందెం పుంజుల ధర విషయానికొస్తే వేలనుంచి లక్షలలో వుంటాయి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి