8, ఆగస్టు 2016, సోమవారం

Traditional Uppada handcrafted sarees

 ఆడవారి  అందానికే మరింత అందం తీసుకువచ్చేది చీర. అందుకే భారతీయస్త్రీలు... అందులో తెలుగుమహిళలకు చీర అంటే మహా ఇష్టం. పెళ్లిళ్లు, శుభకార్యాలయాల్లో ఉప్పాడ జమ్‌దానీ పట్టుచీరలు ధరించటమంటే మగువలు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ ఉప్పాడ చీరల తయారీలో నేత కార్మికుల నైపుణ్యం అణువణువునా కనిపిస్తుంది.


Uppada
saree
ఉప్పాడ, తూర్పు గోదావరి జిల్లా, కొత్తపల్లె మండలానికి చెందిన గ్రామము. ఈ వూరు కాకినాడ వాకలపూడి లైట్ హౌస్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో వుంది, పిఠాపురం నుంచి కూడా ఈ వూరు చేరవచ్చు.  జరీ   తోచేయబడిన "జామదాని" చీరల నేతకు ఈ ఊరు ప్రసిద్ధి చెందింది. వీటిని "ఉప్పాడ చీరలు" అని కూడా అంటారు. చేనేత వస్త్రాల తయారీలో ఈ ఉప్పాడ గ్రామానికి మూడొందల ఏళ్ల చరిత్ర ఉంది. జమ్‌దానీ  చీరల తయారీలో నేతన్నల గొప్పతనాన్ని, కళానైపుణ్యాన్ని  చాటిచెప్పింది ఈ ప్రాంత కార్మికులే. అందుకే అందమైన కళానైపుణ్యంతో ప్రాణం పోసుకున్న జమ్‌దానీ చీరలకు ఉప్పాడ కేరాఫ్ అడ్రసు గా మారింది.  చేనేత కార్మికుల శ్రమను గుర్తించిన ప్రభుత్వం.. 1972వ సంవత్సరంలో రాష్ట్రపతి అవార్డుతో సత్కరించారు. దీంతో ఉప్పాడ ఖ్యాతి దేశస్థాయిలో ప్రాచుర్యం పొందింది.

జమ్‌దానీ అనేది బంగ్లాదేశ్‌కు చెందిన ఈ అపురూప చేనేత కళ. "జమ్‌దానీ"  అనే పదం పర్షియన్ భాషలోనిది. ఆ భాషలో "జమ్" అంటే పువ్వు అని అర్థం.  జమ్‌దానీ సంప్రదాయ నేత కళను యునెస్కో సైతం పురాతన సాంస్కృతిక సంపదగా గుర్తించింది.

ఇంత ప్రాచుర్యం ఉన్న ఉప్పాడ చీరల వెనుక చేనేత కార్మికుల కఠోర శ్రమ అంతా ఇంతా కాదు. మగ్గంపై నిర్విరామంగా 10 గంటలు పనిచేస్తే అరమీటరు చీర ఉత్పత్తి చేయగలుగుతారు . జమ్‌దానీ చీర తయారీకి 10 రోజుల నుండి రెండు నెలల వరకు పడుతుంది. ఈ చీర తయారీకి ఇద్దరు లేదా ముగ్గురు కార్మికులు రోజుకు 10 గంటలు నిర్విరామంగా శ్రమిస్తారు. ఈ చీరను నేసేందుకు డిజైన్‌ వేసుకోవడం.. సిల్క్‌ దారాలు అల్లడం.. మగ్గంపై నేయడం వంటి పనులకు  చేనేత కార్మికులు ఎంతో శ్రమిస్తారు.

ఈ చీరల తయారీలో స్వచ్చమైన జరీతో పాటు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సన్నటి పట్టును వినియోగిస్తారు. అన్ని పట్టువస్త్రాల మాదిరిగా కాకుండా ఈ చీరపై ఉన్న డిజైన్‌ చీరకు ఇరువైపులా ఒకేలా ఉండడం దీని విశిష్టత. అంతేగాక కంచి, ధర్మవరం పట్టుచీరల కంటే ఈ ఉప్పాడ జమ్‌దానీ చీరలు బరువు తక్కువగా ఉంటాయి .




3, ఆగస్టు 2016, బుధవారం

Rajahmundry Gangaraju Palakova


రాజమండ్రి నగరంలోని ....టి.నగర్ ... ఆ వీధిలోకి అడుగు పెట్టగానే కమ్మటి వాసనలు....మనల్ని సాదరంగా ఆహ్వానిస్తాయి. మనప్రమేయం లేకుండానే మన కాళ్లు అటువైపు దారి తీస్తాయి. ఆ ఇంటి ముందు బారులు తీరిన జనం కనిపిస్తారు. ఒకరు నెయ్యి కావాలంటే, ఒకరు పాలు కావాలంటారు. ఒకరు పెరుగు కావాలంటే మరొకరు పాలకోవా కావాలంటారు. ఇంతలోనే ఇంకొకరు వచ్చి పూతరేకులు రెడీయేనా అని అడుగుతారు. అడిగిన వాటన్నింటినీ ఆలస్యం చేయకుండా అందజేస్తారు ఆ ఇంటిలోని వాళ్లు. మూడు తరాలుగా అక్కడి ప్రజలకు రుచికరమైన పాలు, పాల పదార్థాలు అందిస్తోంది పాల "గంగరాజు డైరీ" . 

పశ్చిమగోదావరి జిల్లా పశివేదల గ్రామం (1950) లో నిమ్మలపూడి వీరన్న అనే రైతు ఇతర ప్రాంతాల నుంచి పాలు సేకరించి విక్రయించేవారు. కుమారుడు గంగరాజు తన 24వ ఏట వీరన్న ప్రారంభించిన పాల వ్యాపారాన్ని రాజమండ్రి దాకా తీసుకువచ్చారు. అక్కడ అప్పుడప్పుడే విస్తరిస్తున్న హోటళ్లకు... పశివేదల, ఉంగుటూరు పరిసర గ్రామాల నుంచి  పాలను సేకరించి రాజమండ్రిలో విక్రయించేవారు. ఆయన పాలు తేకపోతే ఆ రోజు అక్కడి హోటళ్లు ఇంక బందే. ‘‘మా నాన్నగారు అలా పాలు సరఫరా చేస్తుండటంతో ఆయన పేరు పాల గంగరాజుగా మారిపోయింది’’ అంటారు ఆయన తదనంతరం ‘గంగరాజు పాల ఖ్యాతి’ ని దేశ విదేశాలకు వ్యాపింపచేసిన ఆయన కుమారుడు గోవిందు.

విజయవాడ నుంచి రాజమండ్రికి ఉదయం పూట ప్యాసింజరు రైలు నడిచేది. గంగరాజు గారు రోజూ ఇదే రైలులో పాలను బిందెలతో రాజమండ్రికి తెచ్చేవారు. పశ్చిమగోదావరి నుంచి పాలు అమ్మేందుకుగాను ఇదే రైల్లో మరికొందరుకూడా గంగరాజు గారితోపాటు  రాజమండ్రి వచ్చేవారు. అందరూ ఆ రైలును పాల బండి అని పిలిచేవారు. 

అమ్మకానికి  పాల సేకరణ పరిమాణం పెంచుతూ పోవడంతో పాలు మిగిలిపోయేవి. దీంతో రాజమండ్రిలో కూడా పాలు అమ్మేవారు గంగరాజు.  రాజమండ్రి ఇన్నీసుపేటలోని త్యాగరాజనగర్ లో  మొదటగా పాల వ్యాపారం మొదలు పెట్టారు గంగరాజు.  గంగరాజు గారి తండ్రిగారు  పంపిన పాలు హోటళ్లకు పోయగా మిగిలిన పాలను ఇంటి దగ్గర కొన్ని అమ్మి, మరికొన్ని పాలను పెరుగుగా మార్చి విక్రయించేవారు. 

పాల "గంగరాజు డైరీ" లో..... పాలు, పెరుగుతోపాటు పాలకోవాకు మంచి డిమాండ్ ఉంది. ఇవే కాకుండా నెయ్యి, వెన్న, పనీరు, పచ్చి కోవా, పూతరేకులు కూడా తయారు చేస్తారు.  గంగరాజు పాలకోవా అమెరికా, లండన్, గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారికి సుపరిచితం. ఫోన్లో ఆర్డర్ ఇచ్చి ఆన్లైన్లో డబ్బులు పంపితే వాళ్లు సూచించిన వారికి డెలివరీ ఇస్తారు.

ఆ రోజుల్లో ఎన్ని పాలు విక్రయించినా ఇంకా పదిహేను లీటర్ల పాలు మిగిలిపోయేవి. గంగరాజు సతీమణి సత్యవతి అలా మిగిలిపోయిన పాలతో పాలకోవా చేసేవారు. ఇంటి ముందే వాటిని అమ్మేవారు. ఆ పాలకోవా గంగరాజు డైరీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. 


మూడు తరాల ఆ కుటుంబ పరిశ్రమ నేడు గంగరాజు డైరీ అనే వ్యవస్థకు బలమైన పునాదిగా నిలిచింది. 

తెలుగువారి అభిమాన నటుడు అక్కినేని, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి M.G.రామచంద్రన్ 
మరియు మరెందరో ప్రముఖులు  కూడా గంగరాజు పాలకోవా రుచిచూసినవారే. 

19, జులై 2016, మంగళవారం

ARTOS - GODAVARI'S FAMOUS SOFTDRINK


భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు, మొత్తం దేశంలో  7 సంస్థలు మాత్రమే సాఫ్ట్ డ్రింక్స్ ని ఉత్పత్తి చేసేవి. కలకత్తా కేంద్రంగా  బెహరాన్ కంపెనీ , మద్రాస్ కేంద్రంగా  స్పెన్సర్స్ కంపెనీ , ముంబాయ్ నుంచి డ్యూకో కంపెనీ , డిల్లీ నుంచి రోజర్స్ కంపెనీ , హైదరాబాద్ నుంచి అల్లాఉద్దీన్ కంపెనీ , మధురై నుంచి విన్సెంట్ కంపెనీ ,తూర్పుగోదావరిజిల్లా  రామచంద్రపురం నుంచి ఎ.ఆర్.రాజు కంపెనీ ఈ సాఫ్ట్ డ్రింక్స్ ని ఉత్పత్తి చేసేవి. ఆ తర్వాత కాలంలో వివిధ కారణాలవల్ల …. రామచంద్రపురం ఏ.ఆర్.రాజు కంపెనీ (ఆర్టోస్) తప్ప  మిగిలిన సంస్థలన్నీ కనుమరుగయ్యాయి.



బహుళజాతి సంస్థల పోటీని తట్టుకుని నిలబడటమంటే మాటలు కాదు. వేల కోట్ల రూపాయల ప్రచారం... టాప్ సెలబ్రిటీలతో ప్రకటనలు... పోటీ పడలేని స్థాయిలో మౌలిక సదుపాయాలు... ఇవన్నీ ఒకెత్తయితే ప్రత్యర్థులు ఊహించని ఆఫర్లిచ్చి వారిని పడేయటం మరొకఎత్తు. థమ్స్ అప్, గోల్డ్స్పాట్, లిమ్కా వంటి సూపర్ బ్రాండ్లతో లీడర్గా ఉన్న పార్లే సైతం మార్కెట్లో వెనకడుగు వేసిందంటే ఇలాంటి ఆఫర్ల వల్లే!. అలాంటి ఆఫర్లకు సైతం పడకుండా పోటీని తట్టుకుంటూ... తమ బ్రాండ్ ఇమేజ్ ని  కాపాడుకుంటూ వస్తున్న  ‘లోకల్’  మెరుపులు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. అలాంటి మెరుపే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆర్టోస్ కూల్ డ్రింక్ . ఇది తూర్పు గోదావరి  బ్రాండ్. ఇది గోదావరి జిల్లాల ప్రజల అభిమాన శీతల పానీయం.

గోదావరిజిల్లాల ఆరాధ్యుడు,అపర భగీరధుడు .... సర్ ఆర్ధర్ కాటన్... ఇండియా వదిలి వెళ్ళేటప్పుడు లండన్ నుంచి తెచ్చుకున్న సోడా మెషిన్ని ధవళేశ్వరం లోనే వదిలి వెళ్ళిపోయారు . ఆ మెషినే ఆర్టోస్ కంపెనీ కి భీజం వేసింది.


a


తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో 1912 లో ఎ.ఆర్. రాజు బ్రదర్స్ సాఫ్ట్ డ్రింక్స్ ఉత్పత్తి మొదలు పెట్టారు.ఆ కంపెనీ 1955 నాటికి ఆర్టోస్ గా అవతరించింది.1912లో ప్రపంచ యుద్ధం కమ్ముకొస్తున్న సమయంలో బ్రిటిష్ మిలిటరీ పెద్ద ఎత్తున రామచంద్రపురానికి వచ్చేది. వారికి ‘గోలీ సోడా’లు అందించటమే అడ్డూరి రామచంద్రరాజు వ్యాపారం. అలా... వారికి దగ్గరైన రాజు... వారి సహకారంతోనే బ్రిటన్ నుంచి కూల్ డ్రింక్స్  తయారీకి సంబంధించిన యంత్రాలను, ముడి సరుకులను తెప్పించుకున్నారు. 1919లో ఏఆర్ రాజు కూల్ డ్రింక్స్ పేరిట  వ్యాపారం మొదలుపెట్టారు. అప్పట్లో బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకోవడానికి సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలన్నీ లేఖల రూపంలోనే జరిగాయి. 1955లో పూర్తి స్థాయిలో  ‘ఆర్టోస్’ కూల్ డ్రింక్ వ్యాపారం మొదలైనది.  అదే ఏడాది దీనికి సంబంధించిన పేటెంట్ హక్కులను కూడా తీసుకున్నారు. ఇప్పటికీ ఈ కూల్డ్రింక్ తయారీకి సంబంధించిన ముడిపదార్థాల మిశ్రమాన్ని  రామచంద్రరాజు కుటుంబం మాత్రమే తయారు చేస్తారు. కూల్ డ్రింక్‌లతో పాటు సోడా, మంచినీటి వ్యాపారంలోకి కూడా ఆర్టోస్ ప్రవేశించింది. 5 రకాల ఫ్లేవర్స్ లో 'ఆర్టోస్' కూల్ డ్రింక్స్ లభిస్తున్నాయి. 




అంతర్జాతీయ బ్రాండ్ల నుంచి పోటీని తట్టుకుంటూ, రుచిలోనూ, నాణ్యత లోను తన ప్రత్యేకత చాటుకుంటున్న మన గోదావరి బ్రాండ్ ఈ "ఆర్టోస్" కూల్ డ్రింక్  .   




3, జులై 2016, ఆదివారం

Godavari Ruchulu (ఉభయగోదావరి రుచులు)


ఆత్రేయపురం పూతరేకులు ... పెరుమాళ్లపురం పాకం గారెలు...  కాకినాడ కోటయ్య కాజా... తాపేశ్వరం పాకం కాజాలు... కోనసీమకు ప్రత్యేకత తెచ్చిన అంబాజీపేట పొట్టిక్కలు... హైదరాబాద్ బిర్యానీని తలదన్నే రావులపాలెం ముంత బిర్యానీ ... అమోఘమైన రుచిగల కండ్రిక పాలకోవాలు...పాకం కారుతూ నోరు తీపి చేసే పెనుగొండ కజ్జికాయలు ... విదేశాలకు సైతం తరలివెళ్లే భీమవరం నాన్వెజ్ పచ్చళ్లు... ఇలా చెప్పుకుంటూపోతే మన గోదావరి రుచులకు అంతేలేదు.  మన గోదావరి రుచులే వేరబ్బా...!! 

ఇక ఒకొక్కటిగా రుచిచూద్దాం పదండి.........
--------------------------------------------------------------------------------------------------------------------------
తాపేశ్వరం కాజా... 


తాపేశ్వరం పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది కాజా. తాపే శ్వరం కాజాకు జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగానూ, దేశవ్యాప్తం గానూ మంచి పేరు ఉంది. ఈ కాజాను చూడగానే ఎవరికైనా నోరూరక తప్పదు. ఈ ప్రాంతంలో జరిగే ఏ శుభకార్యంలో నైనా తాపేశ్వరం కాజా ఉండాల్సిందే. కె.గంగవరం మండలం కోటిపల్లి వద్ద బ్రహ్మపురి గ్రామానికి చెందిన పోలిశెట్టి సత్తిరాజు కుటుంబంతో కలిసి తాపేశ్వరం గ్రామానికి వలసొచ్చారు. అప్పట్లో మిఠాయి రామస్వామి వద్ద ఆయన పనిచేశారు. కొంత కాలానికి రామస్వామి తనవ్యాపారాన్ని ఆపేశాడు. దీంతో సత్తిరాజు తాపేశ్వరంలో హోటల్ను స్థాపించారు. ఆ అనుభవంతో కాజాలను తయారుచేసి అమ్మేవాడు. ఈ కాజాల రుచి, నాణ్యత బాగుండటంతో ప్రజల్లో కాజాపట్ల మక్కువ ఏర్పడింది. నాటి నుంచీ ఈ కాజాలకు ప్రత్యేకత చాటుకుంది. 1970 దశకంలో సత్తిరాజు హోటల్ను తొలగించి పూర్తిస్థాయిలో మిఠాయి దుకాణాన్ని అభివృద్ధి చేశారు. ఆయన కుటుంబ సభ్యులు ఎవరికివారు షాపులను ఏర్పాటు చేసుకున్నారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది తాపేశ్వరం కాజా పేరుతో జీవనోపాధి పొందుతున్నారు. శ్రీ భక్తాంజనేయ స్వీట్స్టాల్స్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా షాపులు వెలిశాయి. ఇంటర్నెట్ వెబ్సైట్లలోనూ తాపేశ్వరం కాజా పేరు మారుమోగుతోంది. 
--------------------------------------------------------------------------------------------------------------------------
ఆత్రేయపురం పూతరేకులు.. 




పూతరేకులకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది ఆత్రేయపురం. ఇక్కడ తయారయ్యే పూతరేకులకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. 30 ఏళ్ల క్రితం నుంచే ఈ వంటకాన్ని ఇక్కడి మహిళలు జీవనోపాధిగా చేసుకుని జీవిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తమవంటకానికి మరింత రుచిని జోడిస్తూ రాణిస్తున్నారు. ఒక ఆత్రేయపురంలోనే కాక లొల్ల, అంకంపాలెం, తాడిపూడి, నార్కేడుమిల్లి, ఉచ్ఛిలి తదితర ప్రాంతాల్లోనూ ఈ వంటకం వ్యాపించింది. పంచదార, బెల్లం, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం పొడి వంటి వాటిని రంగరించి మరింత రుచికరంగా తయారు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారు కచ్ఛితంగా రుచిచూడాల్సిన ఆహారా పదార్థాల్లో ఇదొకటి. 
--------------------------------------------------------------------------------------------------------------------------
రావులపాలెం ముంతబిర్యానీ...


హైదరాబాద్ దమ్ బిర్యానీని సైతం మైమరిపించే బిర్యానీ కోనసీమ ముఖ్య ద్వారామైన రావులపాలెంలో ఉంది. ఇక్కడ ముంతబిర్యానీ అంటే అందరికీ నోరూరక తప్పదు. బిర్యానీ ప్రియుల అభిరుచికి తగ్గట్టుగా ఉంటూ వారి మనసును దోచేస్తుంది. 2005లో రావులపాలెంలోని ఒక రెస్టారెంట్లో ముంతలో వేసి బిర్యానీ అమ్మకం ప్రారంభమైంది. క్రమేపీ ఆదరణ పెరగడంతో ప్రస్తుతం రావులపాలెం చుట్టుపక్కల ప్రాంతాల్లో సైతం ముంత బిర్యానీ విశేషంగా విక్రయిస్తున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహన చోదకులు తప్పకుండా ముంత బిర్యానీ కొనుగోలు చేసి తినిమరీ వెళుతుంటారు. 
--------------------------------------------------------------------------------------------------------------------------
అంబాజీపేట పొట్టిక్కలు...


ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందిం చడంలో పొట్టిక్కలు ప్రధానపాత్ర పోషిస్తాయి. కోనసీమలోని అంబాజీపేట, అమలాపురం పరిసర ప్రాంతాల్లో అతికొద్ది మంది మాత్రమే అమ్ముతుంటారు. వీటికి చాలా ప్రత్యేకత ఉంది. వీటిని తినేందుకు ఎక్కడ నుంచో ఇక్కడికి వస్తారు. ప్రధానంగా అంబాజీపేటలో వీటిని తయారుచేసి సమీప ప్రాంతాలైన అమలాపురం, రావులపాలెం, కొత్తపేట, గన్నవరం ప్రాంతాల్లో ఉండే హోటళ్లకు తరలిస్తారు. రోజుకు రూ.1,500- 2,000 వరకూ పొట్టిక్కలు అమ్ముడవుతాయి. అంతేగాక ఈ పొటిక్కలకు సంబంధించి పనస ఆకుల తయారీతో మహిళలు ఉపాధి పొందుతున్నారు. 
--------------------------------------------------------------------------------------------------------------------------
కాకినాడ కోటయ్య కాజా...


1901 సంవత్సరంలో కోటయ్యగారు ఈ  కాకినాడ కాజా రుచిని ప్రజలకు మొదటిసారిగా అందించారు. ఇవి తాపేశ్వరం మడత కాజాలు వంటివి కావు. కోలగా దొండకాయలాగా ఉంటాయి. కొరకగానే లోపల ఉన్న పాకం జివ్వున నోట్లోకి వస్తోంది. వీటిని గొట్టం కాజాలూ అనిఅంటారు. మొదట జిల్లావ్యాప్తంగా తర్వాత రాష్ట్రం, అనంతరం దేశవ్యాప్తంగా ఈ కాజాలు ఖ్యాతిగాంచాయి. దీన్ని తయారు చేసేందుకు ఎంతో మంది ప్రయత్నించినా కోటయ్య కాజా రుచి ఎవరూ తీసుకురాలేకపోయారు. మొదట్లో చేత్తోనే తయారు చేసేవారు. కోటయ్యగారే స్వయంగా ఇంటింటికీ తిరిగి అమ్మేవారు. అనంతరం ఒక చోట షాపుపెట్టి అభివృద్ధి చేశారు. ఇప్పుడు యంత్రాలతోనూ కాజాను తయారు చేస్తున్నారు. కోటయ్య గారి మూడో తరం వ్యక్తులు ప్రస్తుతం షాపును నడుపుతున్నారు.
--------------------------------------------------------------------------------------------------------------------------
 పెరుమాళ్ల పురం పాకం గారెలు...
వింటే మహాభారతం వినాలి, తింటే గారిలే తినాలనేది అనేది నానుడి. తూర్పుగోదావరి జిల్లాలోని తొండంగి మండలం తీర ప్రాంత గ్రామమైన పెరుమాళ్ల పురం, పాకం గారెలకు ప్రసిద్ధి. ఐదు దశాబ్ధాలుగా ఈ గారెలను ఇక్కడ తయారు చేస్తున్నారు. జిల్లాతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి పెరుమాళ్లపురం పాకం గారెలను ఎంతో ఇష్టంగా తింటారు. 60 ఏళ్ళ కిందట పేరూరి అప్పాయమ్మ పెరుమాళ్ళపురంలో ఈ బెల్లం గారెలు తయారిని ప్రారంభించారని చెబుతారు. నాటి నుంచి నేటికీ పాకం గార్లకు ఈ వూరు చాలా ప్రసిద్ధి.
--------------------------------------------------------------------------------------------------------------------------
ఖండ్రిగ కోవా...


ప్రస్తుతానికి  ఇది  ఉభయగోదావరి జిల్లాల ఫేమస్ స్వీట్. ఊరు పేరునే కోవా పేరుగా మార్చేసుకుంది.కొత్త పేట మండల కేంద్రానికి కూతవేటు దూరంగా చిన్నగా ప్రారంభమైన వ్యాపారం నేడు ఉభయగోదావరి జిల్లాలకు పాకింది. 
--------------------------------------------------------------------------------------------------------------------------

తూర్పు గోదావరి జిల్లాలో నగరం గ్రామంలో తయారు చేసే నగరం గరాజీలు చాలా పేరు పొందినాయి.  ఈ గారాజీలే కాకుండా కాస్తాలు, నాన్ రొట్టి షేర్వా కూడా  ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.

బియ్యం పిండి, పంచదారతో గరాజీలు ప్రత్యేకంగా తయారుచేస్తారు. వీటిని రాష్ట్రంలోని, దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపిస్తారు.. ఎందుకంటే నగరం గరాజీలకు అంత డిమాండ్ మరి..గ్రామంలో గరాజీల తయారీ ఒక కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందింది.సుమారు వంద కుటుంబాల వారు జీవనోపాధి పొందుతున్నారు
--------------------------------------------------------------------------------------------------------------------------
పెనుగొండ కజ్జికాయలు..



పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో కజ్జికాయలు స్పెషల్. ఎవరు పెనుగొండ  వెళ్లినా ఈ కజ్జికాయలు రుచి చూడవసిందే. పాకం కారుతూ నోరు తీపి చేసే కజ్జికాయలంటే ఇష్టపడనివారుండరు. దేశ విదేశాల్లో ఉన్న తమ బంధువులు, స్నేహితులకు ఈ పెనుగొండ కజ్జికాయలను పంపిస్తూవుంటారు .

29, జూన్ 2016, బుధవారం

Ajjaram - Famous for Brass Business

పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలంలో గల  అజ్జరం గ్రామం అంటే ఇత్తడి పరిశ్రమకుపెట్టింది పేరు.  ఇది తణుకు పట్టణానికి సమీప గ్రామము. ఈ ఊరిలో  ఏ వీధిలోకి వెళ్లినా ... టంగ్... టంగ్... మనే చప్పుడే మనని పలకరిస్తూ స్వాగతం పలుకుతుంది . అజ్జరం గ్రామం గత 100 సంవత్సరాల పూర్వం నుంచి ఇత్తడి పరిశ్రమకి పేరొందిన గ్రామం, సుమారు 10వేలమంది ఎన్నో ఏళ్లుగా ఇత్తడి వస్తువులు తయారీలో ఉన్నారు. ఈ కేంద్రాల్లో స్థానికులే కాకుండా సమీప గ్రామాల నుంచి వచ్చి పని చేస్తున్నారు. గతంలో గ్రామంలో 50వరకు ఇత్తడి తయారీ, విక్రయ దుకాణాలు ఉన్నాయి. ప్రస్తుతం సుమారు 30 వరకు దుకాణాలు ఉన్నాయి. ఇది అజ్జరం వారి ఇత్తడి సామగ్రి దుకాణమంటూ పలు పట్టణాల్లో దుకాణాలు చూస్తూనే ఉంటాం. అంటే ఆ ఇత్తడికి ఉన్న గిరాకీ ఏ పాటిదో దీన్ని బట్టే అర్థం అవుతుంది.


ఇక్కడ ఇత్తడితో అన్ని రకాల గృహోపకరణాలు (బిందెలు , కాగులు , కలాయ్ గిన్నెలు , గుండిగలు మొదలైనవి ) , దేవాలయాలకు సంబందించిన
మకరతోరణాలు,కలశాలు,ధ్వజస్తంభం తొడుగులు మరియు పంచలోహ విగ్రహాలు తయారుచేస్తారు. ఇవేకాకుండా గృహాలంకారాలను కూడా తయారుచేస్తారు. ఈ ఊరిలో తయారైన ఇత్తడి బిందెలకి  మంచి పేరు ఉంది. శోభన్ బాబు,శ్రీదేవి నటించిన దేవత సినిమాలోని 'ఎల్లువొచ్చి గొదారమ్మా .....' అనే పాటకోసం వాడిన సుమారు 1000 బిందెలు ఈ అజ్జరం గ్రామం నుండే సరఫరా చేయబడ్డాయి.


అజ్జరం ఇత్తడిలో నాణ్యత బాగుంటుందనేది వినియోగదారుల నమ్మిక. అజ్జరం ఇత్తడి వ్యాపారానికి అదే పెట్టుబడి. ఇక్కడి వ్యాపారులు పాత ఇత్తడి వస్తువులను కొని, వాటిని మరలా కరిగించి తిరిగి వస్తువుల తయారీకి వాడతారు. పాత ఇత్తడిని కరిగించేందుకు ప్రత్యేక నిపుణులు ఉంటారు


 రైతన్నలు పంటలను కాపాడుకునేందుకు పురుగు మందులు పిచికారి చేసి 10 లీటర్ల ఇత్తడి స్ప్రేయర్ల తయారీకి కూడా అజ్జరం ఎంతో పేరు పొందింది. ఇక్కడ తయారైన  ఈ చేతిపంపు స్ప్రేయర్లను  రైతులు నేటికి ఎంతో నమ్మకంగా కొంటారు.



గుడి గంటల తయారీకి పెట్టింది పేరు అజ్జరం. ఇక్కడ తయారు చేసిన ఇత్తడి గంటలు దేశవిదేశాల్లో మంచి గుర్తింపు పొందాయి. విదేశాలకు చెందిన వారు కూడా ఇక్కడే గంటలను ప్రత్యేకంగా ఆర్డరు ఇచ్చి మరీ తయారు చేయించి తీసుకెళ్తుంటారు.







26, జూన్ 2016, ఆదివారం

Hilsa Ilisha (పులసచేప)




Hilsa Ilisha (పులసచేప)

గోదావరి నదీపాయలు అద్భుతమైన మత్స్యసంపదకు జలాశయాలు.నదీపాయల్లో లభ్యమయ్యే మత్స్య సంపద అంటే ఎంతటి వారైనా మక్కువ చూపాల్సిందే.రుచికే కాదు..గోదావరి చేప తింటే ఆరోగ్యం... అందుకే ఎంతటివారైనా గోదావరి చేప రుచికి దాసోహం అంటారు...

గోదావరి చేపలు చాలా రుచికరంగా ఉంటాయి.వీటిలో ముఖ్యమైనది పులస. గోదావరి వరద వచ్చిన సమయంలోనే ఇది లభిస్తుంది. వాస్తవానికి ఇది సముద్రంలో వుండే   చేప. గోదావరికి కొత్తనీరు వచ్చినప్పుడు ఎదురొచ్చి ఎర్రనీటిలోని నురగను తిని రుచికరంగా తయారవుతుంది. దీని ఖరీదు వేలల్లో ఉంటుంది. ధవళేశ్వరం దిగువ గోదావరి పాయల్లో మాత్రమే ఇది లభ్యమవుతుంది. 


పులస చేప శాస్త్రీయ నామం 'హిల్సా ఇలీషా' . ఈ  పులసలు ఇతర ఖండాలనుండి గోదావరిలోకి వలసవచ్చిన చేపలు. వీటిని సముద్రములో వున్నప్పుడు  విలసలు అని పిలుస్తారు.పులసలు  సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. గోదావరి నుంచి వరదనీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లుపెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం పులసల ప్రత్యేకత. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి. సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వరదనీటి ద్వారా ఈ పులసలు వచ్చి వలలో పడతాయి. వలలో పడిన వెంటనే చనిపోతాయి. వలలో పడ్డాక బ్రతికివున్న పులసలు వాటిని పట్టుకునే మత్యకారులు కూడా చూడలేరంటే ఆశ్చర్యము కలగక మానదు.  అయితే ఈ చేపలు రెండు రోజులైనా పాడవ్వవు. అదే ఈ పులసల విశిష్టత. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారిపోతుంది. అలాగని గోదావరి అంతా ఈ పులస ఉండదు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి. ఈ పులసల్లో ఆడ పులస(శన), మగ పులస (గొడ్డు) అని రెండు రకాలుంటాయి. ఇందులో ఆడచేప(శన) కి   రుచి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ చేప ధర వేలల్లోనే ఉంటుంది. 


పులసను వేటాడడం ఆషామాషీకాదు. గేలం వేస్తేనో, వల విసిరితేనో ఇవి దొరకవు. ఏటిమధ్యకు వెళ్లి వలను మత్స్యకారులు ఏర్పాటు చేసుకుంటారు. ఈ వలలూ మూడు రకాలుంటాయి. మూడు పొరలవల, సింగిల్ వల, కత్తు వలలు. పులసలు పట్టుకునేందుకు మూడ పొరల వలను వాడతారు. ఈ వలకు రూ.20 వేలు అవుతుంది. ఈవలలు ఒక్క ఏడాదికే పనిచేస్తాయి. పులసను పట్టేందుకు ఒక నావలో ముగ్గురు చొప్పున మత్స్యకారులు వేటకు వెళతారు. ఆ ముగ్గురూ కలిపి చేపలను పట్టి పెట్టుబడులు తీరుస్తారు. ఆ తర్వాత వచ్చిన లాభాలను ముగ్గురూ పంచుకుంటారు. ఇంతా చేసి తెల్లవారుజామున వేటకు వెళితే సాయంత్రానికి ఒకటి రెండు దొరికితే గొప్పే. కొన్ని సందర్భాల్లో అసలు చిక్కనే చిక్కవు. అందుకే వీటి ధర అంత అధికం.

సముద్రానికి దగ్గరగా ఉండే యానాం, కోటిపల్లి ప్రాంతాల్లో దొరికే పులసలకు తక్కువ ధర ఉంటుంది. ఎందుకంటే అవి అప్పుడే గోదావరి నీటిలోకి ప్రవేశిస్తాయి కాబట్టి.  కపిలేశ్వరపురం, ఆలమూరు ప్రాంతాల్లో దొరికే చేపలు కొంచెం ధర పలుకుతాయి.  పొట్టిలంక, ధవళేశ్వరం, బొబ్బర్లంక సమీపంలో దొరికే చేప ధరలు అధికంగా ఉంటాయి. ఇక్కడ దొరికే చేపలకు రుచి అధికంగా ఉండడంతో డిమాండ్ ఉంటుంది. ఆయా సైజులను బట్టి రూ.500 నుంచి రూ.6 వేల వరకూ ధర పలుకుతాయి. 


వండటంలో నేర్పు ఉన్న వారు తప్ప ఇతరులు ఈ పులస పులుసును వండలేరు. కట్టెల పొయ్యిపై కుండలోనే ఈ పులసను వండుతారు. చింత పుల్లలనే వంటకు వాడతారు. మట్టికుండలో వండిన పులస పులుసు రుచికి ఏదీ సాటిరాదు. ఉల్లిపాయలు, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పేస్ట్, పొడవుగా చీరిన పచ్చిమిరపకాయలు, చింతపండు పులుసు, బెండకాయ ముక్కలు, ఆవకాయ నూనెను ఈ వంటకంలో ఉపయోగిస్తారు. చింతపండును లేతకొబ్బరి నీళ్లలో నానబెట్టి దాని నుంచి తీసిన పులుసునే కూరలోకి ఉపయోగిస్తారు. కొందరు ఒకచుక్క ఆముదాన్ని కలుపుతారు. కొంత ఉడికిన తర్వాత మంటను ఆపేసి చింతనిప్పులతోనే పులుసును మరగనిస్తారు. దీనివల్ల చేపముక్కల్లో ఉన్న సన్నటిముళ్లన్నీ కరిగిపోతాయి. కాసేపటికి కొంత వెన్నముద్దను వేసి దించేస్తారు. మొత్తం వేడంతా పోయి చల్లారిన తర్వాతే సీవండి రేకులో ఉంచుకున్న ఆవకాయతేట పులుసులో కలుపుతారు. ఈ పులస పులుసును రాత్రి వండి ఉదయం తింటేనే రుచి. 



24, జూన్ 2016, శుక్రవారం

Mada Forest - Coringa Wildlife Sanctuary


ఉష్ణ,సమశీతోష్ణ మండల తీరప్రాంతాలలో ఉప్పునీటిలో పెరిగే చెట్లు, పొదల సముదాయాలను మడ అడవులు అంటారు.నదీజలాలు సముద్రంలో కలిసేచోట చిత్తడి నేలలలో మడ అడవులు పెరుగుతాయి. తీర ప్రాంతానికి సహజసిద్ధ రక్షణ గోడగా ఇవి వుంటాయి.

మడ అడవులలో పెరిగే చెట్ల మరియు పొదల  వేర్లు భూమిలోకి  అల్లుకుపోయి సముద్రం నుంచి వచ్చే అటుపోట్లను, బలమైన ఈదురుగాలులను, సునామీలను అడ్డుకుని తీరప్రాంతంలో  భూమి సముద్ర కోతకు గురికాకుండా కాపాడుతాయి. ఈ అడవులు ఎన్నొ జీవరాసులకు జీవనాధారము.
Coringa Wildlife Sanctuary
మడ అడవులలో ఎన్నో రకాల చెట్లు మరియు పక్షులు,కీటకాలు,అనేక రకాల జీవరాసులు జీవిస్తున్నాయి.  తెల్లమడ, ఉప్పుపొన్న, కలింగ, తాండ్ర, గుల్లిలం, తిల్లా, పొన్న మొదలైన వృక్షజాతులతో పాటు చిల్లంగి, కళ్ళతీగ, పెసంగి, దబ్బగడ్డ వంటి మూలికలు పెరుగుతున్నాయి. మొసళ్ళు, ఫిషించ్‌క్యాట్స్‌, నీటి కుక్కలు, డాల్ఫిన్స్‌ వంటి జంతువులు కూడా ఈ అడవుల్లో జీవిస్తున్నాయి. 120 రకాల పక్షులు, కీటకాలు తమ జీవనాన్ని సాగిస్తున్నాయి. చేపలు, రొయ్యలు, పీతలు మొదలైన మత్స్యసంపద సంతానోత్పత్తికి, వివిధ రకాల పక్షి జాతులు, ఔషద మొక్కలకు అవాసాలుగా మడఅడవులు నిలుస్తున్నాయి.

Coringa Wildlife Sanctuary
తాళ్ళరేవు మండలంలోని కోరంగి నుండి ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల తీర గ్రామాల్లో 332.60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మడ అడవులు విస్తరించి వున్నాయి. 

తూ.గో.జిల్లా లో కాకినా‍‍‍‍‍‍డ సమీప‍ంలొని కొర‍ంగి వద్ద వున్న  కోరంగి అభయారణ్యం (మడ అ‍డవులు) ,  దాదాపు 235.7 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి వున్నాయి. ఈ అభయారణ్యం సంరక్షణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ పర్యవేక్షిస్తుంది.

మడ అడవుల్లో విహారం మనోహర దృశ్య కావ్యం. ఉప్పుటేరులు, పాయలు మధ్యలో పచ్చని పరుపు పరిచినట్లుగా విస్తరించి ఉండే మడ అడవులు పర్యాటక అందాలకు వేదికగా నిలుస్తున్నాయి.


korangi mada forest
ఈ మడఅడవుల మధ్య ఉప్పుటేరులో పడవ ప్రయాణం ఓ మధురానుభూతి. వీటిని తిలకించేందుకు తాళ్లరేవు మండలం కోరంగి, కాట్రేనికోన మండలం బలుసుతిప్పలలో అటవీశాఖ బోట్లను ఏర్పాట్లు చేసింది.
Coringa Wildlife Sanctuary
ఈ అభయారణ్యం కాకినాడ నుండి 20 కి.మీ, రాజమహేంద్రవరం నుండి 70 కి.మీ దూరంలో వున్నది . ఉప్పునీటి మొసళ్ళు ఈ అభయారణ్యం ప్రత్యేకత.  కోరంగి అభయారణ్యాన్ని సందర్శించడానికి డిసెంబర్ నుండి జూన్ నెలల మధ్య కాలం అనువైనది. 
Coringa Wildlife Sanctuary










21, జూన్ 2016, మంగళవారం

Pithapuram (The Saiva,Vishnu,Sakthi,Datta kshetram)




 దేశంలో మరెక్కడాలేని విధంగా ఒకేచోట శైవ,శక్తి,,విష్ణు, దత్త మందిరాలు  వున్న  దివ్య క్షేత్రమే పిఠాపురం. భారతదేశంలో ఉన్న  అతిపురాతన దివ్య క్షేత్రాలలో ఇదొకటి.  ఈక్షేత్రం  దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల విశ్వాసాన్ని విశేషంగా చూరగొంటోంది. వెనుకటి కాలంలో ఈ ప్రాంతాన్ని "పిస్తాపురం"  అని సంబోధించేవారు. కాలక్రమంలో అదే "పిఠాపురం" గా  పిలవబడుతోంది.

శక్తిపీఠం(పురూహూతికా అమ్మవారు)గా, త్రిగయల్లో ఒకటి(పాదగయ)గా, పంచమాధవ క్షేత్రాల్లో విశిష్ఠమైనదిగా (కుంతీమాధవ క్షేత్రం) పేరొందింది. ఇంకా అనఘా దత్తక్షేత్రంగా, కుక్కుటేశ్వరస్వామి(శివ)  నిలయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.


త్రిగయలో ఒకటిగా విరాజిల్లుతున్న పాదగయని క్షేత్రం దక్షిణ కాశిగా పిలుస్తారు. త్రిమూర్తులు వృద్ధ బ్రాహ్మణుని వేషంలో గయాసుర అనే రాజు వద్దకు వచ్చి మాయోపాయంతో అతన్ని వధించి అతని కోరిక మేరకు మృతదేహాన్ని మూడుముక్కలు చెయ్యగా వాటిలో పాదలు పడిన చోటు పిఠాపురం పాదగయ శైవక్షేత్రం అయ్యింది. ఇక్కడ శివుడు కుక్కుటేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు.  ఆయన పక్కనుండే పార్వతిని రాజరాజేశ్వరిగాను భక్తులు కొలుచుకుంటారు.  ఈ పాదగయ నందు  తమ పితృదేవతలకు  చేయు పిండ ప్రదానం మరియు  తర్పణములవలన, వారి పితరులు నూరు తరముల వరకు తరించుదురు అని ఈ క్షేత్ర మహిమ తెలిసిన పెద్దవారు చెబుతారు. 





సతీదేవి పార్థివ శరీరాన్ని  విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఖండించగా,  ఆ శరీరం 18 భాగాలుగా తెగి వేర్వేరు ప్రదేశాల్లో పడి శక్తిపీఠాలయ్యాయి. సతీదేవి పీఠభాగం పడిన చోటైన పిఠాపురంలో పురుహూతికాదేవి పదవశక్తి పీఠంగా విరాజిల్లుతోంది.









ఇంద్రుడు బ్రహ్మహత్యా దోష నివృత్తి కోసం అయిదు విష్ణుక్షేత్రాలు ప్రతిష్ఠించగా అవి పంచమాధవ క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి. అందులో ఒకటైన కుంతీమాధవక్షేత్రం పిఠాపురంలో ఉంది.


త్రిమూర్తి అవతారమైన దత్తాత్రేయుడు తన భక్తులు సుమతి, రాజశర్మ కోరిక మేరకు పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభునిగా జన్మించడంతో పిఠాపురం ప్రముఖ దత్తక్షేత్రంగా కూడా విరాజిల్లుతోంది.

దివ్యక్షేత్రాల సంగమమైన పిఠాపురాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే గాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఈ క్షేత్రం కాకినాడకు 19 కిలోమీటర్ల దూరంలో వుంది. మద్రాస్-హౌరా బ్రాడ్ గేజ్ లైన్లో వెళ్లే రైళ్లన్నీ ఇక్కడ ఆగుతాయి.



20, జూన్ 2016, సోమవారం

Rajamahendravaram




Rajamahendravaram
 భారదేశంలో చారిత్రాత్మికంగా,రాజకీయ,ఆర్ధిక ,సంస్కృతీ పరంగా  తూర్పుగోదావరి జిల్లాకి ఒక ప్రత్యెక స్టానం వుంది. జిల్లాలోని రాజమహేంద్రవరం (రాజమండ్రి) నగరం వీటన్నిటికి కేంద్రబిందువుగా భాసిల్లుతోంది. ఎన్నో సంఘ సంస్కరణలకు తోలి అడుగులు రాజమండ్రి లోనే పడ్డాయి.   క్రీ.శ.919 నుంచి 934 మధ్యకాలంలో రాజమహేంద్రవరం నగరాన్ని నిర్మించినట్టు చారిత్రక అధరాలు వున్నాయి.  తూర్పు చాళుక్యుల  రాజధానిగా రాజమండ్రి ఒక వెలుగు వెలుగొందింది. 

గోదావరి దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులన్నిటిలోను పెద్దది. దీనిని ప్రపంచంలో వున్న అతిపెద్ద నదుల్లో ఒకటిగా అమెరికా సంయుక్త రాష్ట్రాల భూగర్భ సర్వే సంస్థ గుర్తించింది. ప్రాచీనకాలంలో తూర్పుగోదావరి జిల్లాలో జైన, బౌద్ధాలు ఉజ్వలంగా ఉండేవి. ఈనాటి పంచారామాలు, అన్నవరం కొండ ఒకటినాటి బౌద్ధ క్షేత్రాలే అన్న వాదన కూడా వుంది.  


Dowleswaram barrage in Rajahmundry 
18 శతాబ్దంలో గోదావరి మీద నిర్మించిన ఆనకట్ట వల్ల రాజమండ్రి ముఖచిత్రమే మారిపోయింది. క్రీ.శ.1852లో గోదావరి నదిపై సర్ ఆర్ధర్ కాటన్ ఆనకట్టను నిర్మించడంతో తూర్పు గోదావరితోపాటు పశ్చిమ గోదావరి జిల్లా ముఖచిత్రం కూడా మారిపోయింది. ఉభయగోదావరి జిల్లాలకు కాటన్ నిర్మించిన ఆనకట్ట ప్రాణాధారంగా మారిపోయింది. తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులుగా గోదావరి, తాండవ నదులు, బంగాళాఖాతం, తూర్పు కనుమలు ఉన్నాయి. గోదావరి నది జిల్లాను సారవంతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ధవళేశ్వరం దగ్గర గోదావరి గౌతమి, వశిష్ట నదులుగా చీలిపోయింది. ఈ మధ్య భూభాగంలో ఉన్న డెల్టా భూభాగాన్నే కోనసీమ అంటారు. గోదావరి రాజమండ్రిలో మొత్తం ఏడు పాయలుగా చీలి, అక్కడ నుండి సుమారు 100 కి.మీ ప్రయాణించి  బంగాళాఖాతంలో కలుస్తోంది. 


Sir Arthur Cotton
1844లో కాటన్ విశాఖపట్నంలో పని చేస్తుండేవారు. ఆ సమయంలోనే ప్రభుత్వం అడగకపోయినా ఆయన గోదావరి డెల్టా అభివృద్ధికి సంబంధించిన ఒక నివేదికను రూపొందించి పంపారు. డెల్టా ప్రాంతంలో ఈస్టిండియా కంపెనీ వస్త్ర కర్మాగారాలు మూసివేయడంతో ప్రజలు నష్టపోయారని, ప్రత్యామ్నాయంగా వరి, చెరుకు పంటలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కాటన్ సూచించాడు. దానికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. గోదావరి డెల్టాకు నీటిపారుదల సౌకర్యాలను కల్పించడానికి నివేదిక పంపాలని ప్రభుత్వం కోరింది. 20 లక్షల ఎకరాల భూభాగంలో సర్వే చేశారు. రోజుకి 10 నుంచి 15 మైళ్లు గుర్రంపై తిరిగి కాటన్ సర్వే నిర్వహించేవారు. గోదావరి డెల్టా సర్వే నివేదిక 1845 ఏప్రిల్ 17న ప్రభుత్వానికి సమర్పించారు. ఆనకట్ట నిర్మాణం రూ.4.75లక్షల నిర్మాణ వ్యయంతో 1847 ఏప్రిల్లో ప్రారంభమైంది. 1852 నాటికి రూ.15 లక్షల వ్యయంతో గోదావరిపై ఆనకట్ట నిర్మాణం పూర్తయింది.
Road cum Rail Bridge in Rajahmundry

 గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణం జిల్లా జనాభా పెరుగుదలపైనా గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత 1871 నాటికి అంటే ప్రాజెక్టు నిర్మించిన 20 సంవత్సరాల తర్వాత జిల్లా జనాభా రెండు రెట్లు పెరిగి 15,92,939కి చేరింది. విశాఖ, గంజాం తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎక్కువగా జిల్లాలో స్థిరపడ్డారు. అనంతర కాలంలో విద్య, వైద్య, రవాణా సౌకర్యాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందాయి. జిల్లాలోని రాజమహేంద్రి నగరాన్ని సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దాయి. 2001లో 48,72,622 ఉన్న జనాభా 2011 నాటికి 51,51,549కి చేరింది.



Kandukuri Veeresalingam Pantulu's house in Rajahmundry


18, జూన్ 2016, శనివారం

East Godavari




తూర్పుగోదావరి మొత్తం విస్తీర్ణం 10,807 చదరపు కిలోమీటర్లు. మొత్తం జనాభా 51,51,549. దీనిలో  25,69,419 మంది మగవారు మరియు 25,82,130 మంది ఆడవారు (2011 జనాభా లెక్కలప్రకారం )

తూర్పు గోదావరి జిల్లాలో  7 రెవెన్యూ డివిజన్లు, 60 మండలాలు 1011 గ్రామపంచాయతీలు,1404 గ్రామాలు  వున్నాయి.

జిల్లాలో 19 అసెంబ్లీ, 3 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి.

మండలాలు

1.అడ్డతీగల               21. కపిలేశ్వరపురం          41. రాజమండ్రి (అర్బన్‌)
2.అయినవిల్లి            22. కరప                            42. రాజానగరం
3.ఆలమూరు             23. కాట్రేనికోన                  44. రామచంద్రపురం
4. అల్లవరం               24. కిర్లంపూడి                   45. రంపచోడవరం
5. అమలాపురం         25. కోటనందూరు            46. రంగంపేట
6. అంబాజీపేట         26. కొత్తపల్లి                      47. రౌతులపూడి 
7. అనపర్తి                   27. కొత్తపేట                    48. రావులపాలెం
8. ఆత్రేయపురం        28. మలికిపురం              49. రాయవరం
9. బిక్కవోలు               29. మామిడికుదురు      50. రాజోలు
10. దేవీపట్నం           30. మండపేట               51. సఖినేటిపల్లి
11.గండేపల్లి                31. మారేడుమిల్లి           52. సామర్లకోట
12. గంగవరం             32. ముమ్మిడివరం         53. శంఖవరం
13. గోకవరం                33. నగరం                      54. సీతానగరం
14. గొల్లప్రోలు             34. పి.గన్నవరం            55. తాళ్ళరేవు
15. ఐ.పోలవరం         35. పామర్రు                   56. తొండంగి
16. జగ్గంపేట              36. పెదపూడి                57. తుని
17. కడియం                37. పెద్దాపురం               58. ఉప్పలగుప్తం
18. కాజులూరు            38. పిఠాపురం                59. వై.రామవరం  
19. కాకినాడ (రూరల్‌) 39. ప్రత్తిపాడు               60. ఏలేశ్వరం
20. కాకినాడ (అర్బన్‌) 40. రాజమండ్రి(రూరల్‌)

అసెంబ్లీ నియోజకవర్గాలు
1.తుని  2.ప్రత్తిపాడు  3.పిఠాపురం  4.కాకినాడ గ్రామీణం  5.పెద్దాపురం  6.అనపర్తి  7.కాకినాడ నగరం  8.రామచంద్రపురం  9.ముమ్మిడివరం  10.అమలాపురం  11.రాజోలు  12.పి.గన్నవరం  13.కొత్తపేట 14.మండపేట  15.రాజానగరం  16.రాజమండ్రి నగరం  17.రాజమండ్రి గ్రామీణం  18.జగ్గంపేట 19.రంపచోడవరం

పార్లమెంటరీ నియోజకవర్గాలు
1.కాకినాడ










2.అమలాపురం













3.రాజమండ్రి (పశ్చిమగోదావరి జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాలు కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, పోలవరం,  రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి)



జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గం అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.


13, జూన్ 2016, సోమవారం

పందెం కోళ్ళు


రెండు కోడి పుంజుల మధ్య జరిగే ఆధిపత్య పోరునే  "కోడి పందెం" అంటారు. ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి పండుగ రోజులలో ఈ కోడిపందాలను నిర్వహిస్తారు.  తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ ఏర్పాట్లతో పెద్ద ఎత్తున ఈ పందాలను నిర్వహిస్తుంటారు. ఈ కోడి పందాలు అతి పురాతన కాలం నుండి  జరుగుతున్నట్టు  చరిత్రకారులు చెబుతారు. 

ఈ పందెం కోసం ప్రత్యేకంగా పెంచిన  కోడిపుంజులను "పందెం కోళ్ళు" అని పిలుస్తారు . వీటి ఆహార విషయంలో యజమానులు ఎంతో శ్రద్ధ వహించి పెంచుతారు. పందెం సమయంలో పందెం కోడి కాలికి మూడు నుండి నాలుగు అంగుళాలు చురకత్తిని కట్టి పందెంలోకి దించుతారు. కోళ్లు పుంజుల కాళ్లకు కత్తులు కట్టి.. కదన రంగంలోకి దింపితే.. రక్తం చిందిస్తూ.. వీరోచితంగా గెలుపుకోసం అవిచేసే పోరాటం అంతాఇంతా కాదు. తనను అప్యాయంగా చూసుకున్న యజమానిని గెలిపించడం కోసం ప్రత్యర్థి పుంజుతో అవి శక్తి కొద్ది పోరాడుతాయి. 


ఈ కోడి పందాలలో బెట్టింగు జరిగే అవకాశం ఉన్నందున మరియు శాంతిభద్రతల సమస్య ఉంటుందని, సంప్రదాయమైన ఈ క్రీడకు  ప్రభుత్వం అనుమతి ఇవ్వదు. అయినా కూడా  చాటుమాటుగా ఈ కోడి పందాలు నిర్వహిస్తారు. 



కోడి రంగును బట్టి ఈ పందెం కోళ్లను రకరకాల పేర్లతో పిలుస్తారు.  వీటిలో డేగ, కాకి ,నెమలి, పర్ల , చవల, సేతువ, కొక్కిరాయి, పచ్చకాకి, రసంగి, కౌజు, మైల, ఎరుపుగౌడు, తెలుపుగౌడు వంటి పలు తెగల కోళ్లుంటాయి. సాధారణ కోడిపుంజులకు భిన్నంగా పందెం పుంజులు దృఢంగా ఉంటాయి. రంగు, సామర్థ్యాన్ని అనుసరించి దాన్ని పలానా తెగ అని గుర్తిస్తారు. ఎరుపు రంగులో ఉండే పుంజును డేగ అని, నీలం రంగులో ఉంటే కాకి అని పిలుస్తారు

ఈ కోడి పందాలు ప్రాచీన క్రీడ అయినందునే , ఈ క్రీడ గురించి తాళపత్ర గ్రంధాలు కూడా వున్నాయి. ఈ గ్రంధాలలో కోడిపుంజు లలో రకాలు, వాటి లక్షణాలు, ఏ పుంజుపై ఏ రకమైన పుంజుని  పందానికి దింపాలి అనే విషయాలు వీటిలో పొందు పరచబడి వున్నాయి.

ఇక ఈ పందెం కోళ్ళకు ఇచ్చే ఆహారం, శిక్షణ కూడా ప్రత్యేకంగా వుంటాయి. వీటికి ఇచ్చే ఆహారం కోసం తక్కువలో తక్కువగా వారానికి రెండు వేల రూపాయలు ఖర్చు వుంటుంది.  జీడిపప్పు, బాదం పిస్తా, ఎండు ఖర్జూరం, కిస్మిస్, కోడిగుడ్డులో తెల్లసొన, మేకపాలు, దంపుడు బియ్యం, రాగులు, గంట్లు, మినపపప్పు, శెనగపప్పు, గోధుమలు కలిపిన మిశ్రమ ఆహారం పెట్టి, పందెంపుంజుని దృఢంగా, ఏపుగా  తయారు చేస్తారు. ఇక పందెం దగ్గరపడే కొలదీ వాటికి తినిపించే ఆహారంలో కూడా మార్పులు చేస్తారు. 


బలమైన తిండితో పాటు పుంజుకి ఇచ్చే శిక్షణ కూడా చాల కఠినముగా వుంటుంది.  రన్నింగ్, స్మిమ్మింగ్, ఇతరత్రా శిక్షణలు అందజేస్తారు.  రోజూ ఉదయాన్నే కోడిపుంజును పరిగెత్తిస్తారు. కోడి బాగా అలసిపోయాక దాని నోట్లో నీరుకొట్టి కఫాన్ని బయటకు తెప్పిస్తారు. దీనివల్ల పోటీ సమయంలో కోడిపుంజు అలసిపోకుండా ఉంటుంది. అనంతరం పచ్చికోడిగుడ్డు తెల్లసొన తినిపించి కాసేపటి తర్వాత మరో అరగంట పరిగెత్తిస్తారు. తర్వాత కాసేపు విశ్రాంతి ఇస్తారు. అనంతరం జీడిపప్పు, బాదంపప్పు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, నల్లజీలకర్ర, తెల్లజీలకర్ర, గసగసాలు దంచిన మిశ్రమాన్ని ముద్దగా తయారుచేసి కోడిపుంజులకు తినిపిస్తారు. కోడిపుంజు కొత్తశక్తిని సంతరించుకునేందుకు ఈ ఆహారం ఉపయోగపడుతుంది. భోజనానంతరం రెండు గంటలపాటు కోడికి విశ్రాంతి ఇస్తారు. ఆ తర్వాత సమీపంలోని వాగు లేదా చెరువుకి తీసుకువెళ్లి ఈత కొట్టిస్తారు. రోజంతా ఈ ఎక్సర్సైజుల వల్ల కోడి ఓంట్లో నొప్పులు చేరితే తీసివేసేందుకు బాడీ మసాజ్ చేస్తారు. కట్టెల మంటపై మట్టిపిడత ఉంచి దాన్ని వేడిచేస్తారు. ఆ వేడిని ఓ గుడ్డకు పట్టించి ఆ గుడ్డతో కోడి తలకు, ఒంటికి, కాళ్లకు మసాజ్ చేస్తారు. దీనివల్ల కోడి ఒంట్లో ఎక్కడైనా నొప్పులు ఉంటే అవి పోవడానికి ఈ మసాజ్ ఉపకరిస్తుంది. రాత్రికి కూడా మంచి ఆహారం పెట్టి విశ్రాంతి ఇస్తారు.

కత్తి పందాలు, డింకీ పందాలు  అని రెండు రకాలుగా ఈ కోడిపందాలు  జరుగుతాయి. 

కత్తి పందెం: పోటీల్లో పాల్గొనే కోడి పుంజుల కాళ్లకు కత్తులు కట్టి బరిలో దించితే దాన్ని కత్తిపందెం అంటారు. పోటీ పుంజుల్లో కత్తిదెబ్బ కాచుకుని చివరి వరకు ఏ పుంజు నిలుస్తుందో అది విజేత అవుతుంది. ఈ పందెంలో కత్తిగాటుపడి పందెంకోళ్లు మృత్యువాత పడుతుంటాయి. చాలా తక్కువ సమయంలో ఈ పోటీలో ఫలితం వస్తుంది. 

డింకీ పందెం: కోడి పుంజులను మామూలుగా బరిలోకి దింపితే దాన్ని డింకీ పందెం అంటారు. ఈ పోటీ పూర్తిగా కోడి శక్తి సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. రెండు కోళ్ల శక్తిసామర్థ్యాలను బట్టి ఈ పోటీలో ఫలితం ఒక్కోసారి చాలా ఆలస్యమవుతుంది. కత్తిపందాల్లో పాల్గొనే పుంజుల కంటే డింకీ పందాల్లో పాల్గొనే పుంజులు చాలా దృఢంగా ఉంటాయి. 

పందెం కోళ్లను గుర్తించడం, వాటిని పోటీలకు సిద్ధం చేయడమే వృత్తిగా జీవిస్తున్నవారు ఎందరో ఉంటారు.  నిర్వాహకులయితే  పందెం సొమ్ములో 10 శాతాన్ని తీత గా వసూలు చేస్తారు, ఇది నిర్వాహకుల లాభం.

పందెం పుంజుల ధర విషయానికొస్తే వేలనుంచి లక్షలలో వుంటాయి.